శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రన్‌వే‌పై చిరుత కలకలం.. పరుగులు పెడుతోన్న సిబ్బంది!

శంషాబాద్ విమానాశ్రయంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఆదివారం తెల్లవారుజామున రన్‌వేపై చిరుతను ఎయిర్‌పోర్ట్ పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారు. చిరుత ఇంకా ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లోనే సంచరిస్తున్నట్టు సమాచారం. దీంతో అటవీశాఖ అధికారులకు విమానాశ్రయం సిబ్బంది సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న వైల్డ్‌లైఫ్ విభాగం సిబ్బంది, జూ అధికారులు.. ఆ పరిసరాల్లో చిరుత కోసం గాలిస్తున్నారు. ఇక, చిరుత సంచారం వార్త తెలిసి ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.

అయితే, దాదాపు మూడేళ్ల కిందట ఎయిర్ పోర్టు గోడ దూకి చిరుత వెళ్లిన ఘటన అక్కడ సీసీటీవీ కెమెరాల్లో ఇదంతా రికార్డయింది. దానిని పట్టుకోడానికి బోన్లు ఏర్పాటు చేసి, గాలించారు. ఎయిర్ పోర్ట్ గోడ దూకి పెద్ద గోల్కొండ, బహదూర్ గూడ వైపు చిరుత వెళ్తున్నట్లుగా వీడియోలో కనిపించింది.

అయితే, 2019 నవంబరు 27న విమానాశ్రయ పరిసరాల్లో చిరుత తిరుగుతోందన్న సమాచారంతో ఎయిర్‌పోర్టు అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఫారెస్ట్, జూ అధికారులను అక్కడకు రప్పించారు. రెండుగంటల పాటు ముమ్మరంగా గాలించగా.. అది చిరుత కాదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చివరికది చిరుత పులి కాదు అడవి పిల్లి అని తేల్చారు. ప్రస్తుతం కూడా చిరుతపులి వ్యవహారం తీవ్ర అలజడి రేపుతోంది. అది అసలు చిరుతేనా? లేక గతంలో మాదిరి అడవి పిల్లా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-28T06:35:18Z dg43tfdfdgfd