మంత్రి రోజా ఆస్తుల వివరాలివే.. 2019తో పోలిస్తే పెరిగిన ఆస్తులు, కార్లు.. ఎన్ని కోట్లంటే!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అభ్యర్థులు నామినేషన్లతో పాటుగా అఫిడవిట్ రూపంలో తమ ఆస్తులు, కేసుల వివరాలను వెల్లిడిస్తున్నారు. శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన.. ఏపీ మంత్రి రోజా ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రి ప్రకటించిన వివరాల ప్రకారం.. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ.4.58 కోట్లకు పెరిగింది. అలాగే 2019 స్థిరాస్తులు రూ.4.64 కోట్లు ఉంటే.. ప్రస్తుతం రూ.6.05 కోట్లు అయ్యింది. ఐదేళ్లలో రూ.81 లక్షలు పెరిగాయి.

2019లో ఆరు కార్లు, ఒక బైక్‌ ఉండగా.. వాటి విలువ రూ.1.08 కోట్లు. ఇప్పుడు 9 కార్లుండగా.. విలువ రూ.1.59 కోట్లు. 2019 నాటి కంటే కార్ల విలువను ఇప్పుడు బాగా తగ్గించారు. ఐదేళ్లలో నగరి నియోజకవర్గంలో భర్త పేరిట 6.39 ఎకరాల భూమి కొన్నారు. మంత్రి రోజాకు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో (చిట్‌ నంబర్‌ ఎల్‌టీ030వీ ఎంఏ/48) రూ.39.21 లక్షల విలువైన చీటీ ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మరో ప్రైవేటు చిట్‌లోనూ ఆమెకు రూ.32,90,450 విలువైన మొత్తం ఉన్నట్లు పేర్కొన్నారు. రోజాపై గత ఎన్నికలప్పుడు 4 కేసులుండగా.. ఇప్పుడు ఒక్కటీ లేదు. అలాగే రోజా ఆమె ఇంటర్‌ వరకు చదివారు.

మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. ఆయనతో పాటూ భార్య స్వర్ణలత ఆస్తులు ఐదేళ్లలో బాగా పెరిగాయి. 2019లో పెద్దిరెడ్డి చరాస్తులు రూ.11.27 కోట్లు, స్థిరాస్తులు రూ.80.47 కోట్లు. తాజాగా చరాస్తులు రూ.10.59 కోట్లు, స్థిరాస్తులు రూ.114.25 కోట్లుగా ఉన్నాయి. స్వర్ణలతకు 2019లో రూ.10.01 కోట్ల చరాస్తి, రూ.29.2 కోట్ల స్థిరాస్తి ఉండగా.. ప్రస్తుతం చరాస్తి రూ.14.55 కోట్లు, స్థిరాస్తి రూ.66.79 కోట్లకు పెరిగింది. మొత్తంగా పెద్దిరెడ్డి ఆస్తి గత ఎన్నికల్లో రూ.91.74 కోట్లుండగా, నేడది రూ.124.84 కోట్లకు చేరింది. ఆయన భార్య ఆస్తి రూ.39.22 కోట్ల నుంచి రూ.110.55 కోట్లకు పెరిగింది. అయినా పెద్దిరెడ్డికి ఒక్క కారూ లేదు.. కేసులు కూడా లేవు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక స్వర్ణలత పేరిట తిరుచానూరు, మదనపల్లె, పుంగనూరు మండలాల్లో ఎక్కువగా భూములు కొనుగోలు చేశారు.

రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలకు 53, శాసనసభ స్థానాలకు 314 నామినేషన్‌లు దాఖలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం నామినేషన్‌ సమర్పించిన వారిలో టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు నామినేషన్‌ వేశారు. అరకు పార్లమెంటరీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని తనూజారాణి తరఫున ఆమె ప్రతినిధులు నామినేషన్‌ వేశారు. సాలూరు నుంచి ఉపముఖ్యమంత్రి రాజన్నదొర (నామినేషన్‌ దాఖలు చేశారు. నెల్లూరు కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కె.రాజు నామినేషన్‌ అందించారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి ఉష శ్రీచరణ్‌ , హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్‌ వేశారు. కడప లోక్‌సభ స్థానానికి వైఎస్‌ అవినాష్‌రెడ్డి నామినేషన్‌ సమర్పించారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-20T03:47:14Z dg43tfdfdgfd