KCR BUS YATRA: రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ బస్సుయాత్ర.. 17 రోజులు 12 నియోజకవర్గాల్లో గులాబీ దళపతి ప్రచారం

KCR Bus Yatra: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు పాలించిన భారత రాష్ట్ర సమితి.. గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎదురు చూసింది. ఇక బీఆర్ఎస్‌ను ఓడించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కంటే.. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించాలని గులాబీ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన గులాబీ దళపతి కేసీఆర్.. బుధవారం నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కరెంటు కోతలు, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, హామీల అమలులో జాప్యమే ప్రధాన ఎజెండాగా గులాబీ బాస్.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్లనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

తెలంగాణ భ‌వ‌న్‌లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన కేసీఆర్.. బస్సు యాత్రను ప్రారంభించారు. మ‌హిళ‌లు మంగ‌ళ‌హారతుల‌తో కేసీఆర్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఇవాళ్టి నుంచి 17 రోజుల పాటు ఈ బస్సు యాత్ర రాష్ట్రంలో కొనసాగనుంది. దాదాపు అన్ని పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ఒకట్రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేసీఆర్ రోడ్‌ షోలు నిర్వహించే విధంగా ఈ బస్సు యాత్రను బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది. మే 10 వ తేదీ వరకు జరగనున్న ఈ బస్సు యాత్ర.. మిర్యాలగూడలో ప్రారంభమై.. చివరికి సిద్ధిపేట బహిరంగ సభతో ముగియనుంది.

బస్సు యాత్ర సందర్భంగా రాష్ట్రంలోని రైతులు, వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి కష్టాలు, సమస్యలను కేసీఆర్ తెలుసుకోనున్నారు. లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు అత్యధిక సీట్లను గెలిపించేలా పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు దిశార్దేశం చేయనున్నారు. బుధవారం మిర్యాలగూడ, సూర్యాపేటలో నిర్వహించనున్న రోడ్ షోలలో గులాబీ దళపతి పాల్గొననున్నారు.

బుధవారం రాత్రి సూర్యాపేటలోనే బస చేయనున్న కేసీఆర్.. గురువారం భువనగిరికి చేరుకుని అక్కడ సాయంత్రం రోడ్ షో నిర్వహించనున్నారు. గురువారం రాత్రి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లి అక్కడ బస చేయనున్నారు. ఇక కేసీఆర్ బస్సు యాత్ర కోసం గులాబీ శ్రేణులు బస్సును అందంగా, ఆకర్షణీయంగా రూపొందించి.. మంగళవారం తెలంగాణ భవన్‌లో బస్సుకు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఇక కేసీఆర్ బస్సు యాత్రలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు దాదాపు 100 మందికిపైగా వాలంటీర్లను నియమించారు.

ఈ బస్సు యాత్ర ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఎక్కువ స్థానాలు వచ్చేలా ప్రణాళికలు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంపై ప్రధానంగా ఎన్నికల ప్రచారం సాగించనున్నారు. దీంతోపాటు ఈ సీజన్‌లో భారీగా పంటలు ఎండిపోవడం.. కరెంట్ సరఫరా లేక మోటర్లు కాలిపోవడం, వరి మద్దతు ధరకు రూ. 500 బోనస్ అమలు చేయకపోవడం, ఆసరా పింఛన్లను రూ.4 వేలకు పెంచకపోవడం, మహిళలకు రూ. 2,500 హామీని అమలు చేయకపోవడం సహా కాంగ్రెస్ సర్కార్ హామీలు నెరవేర్చడంతో విఫలమైన అంశాలపై కేసీఆర్ ఫోకస్ చేయనున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-24T11:35:38Z dg43tfdfdgfd