చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్.. అర్జంట్‌గా శ్రీకాకుళంకు పయనం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి సీట్ల పంచాయితీ మొత్తానికి ఓ కొలిక్కి వచ్చింది. నామినేషన్లకు మరో రోజు మాత్రమే సమయం ఉండటంతో పెండింగ్ సీట్లపై క్లారిటీ వచ్చేసింది. దీంతో దెందలూరులో చింతమనేని ప్రభాకర్ ఊపిరి పీల్చుకున్నారు.. చంద్రబాబు నుంచి ఫోన్ రావడంతో లైన్ క్లియర్ అయ్యింది. అనపర్తి సీటుపై స్ఫష్టత రావడంతో దెందులూరులో చింతమనేనినికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

కూటమి సీట్ల విషయంలో కొద్దిరోజులుగా గందరగోళం ఏర్పడింది. టీడీపీ చివరి నిమిషంలో మూడు సీట్ల (అనపర్తి, తంబళ్లపల్లి, దెందులూరు)పై క్లారిటీ ఇవ్వలేదు. అనపర్తి సీటును టీడీపీకి ఇచ్చి తంబళ్లపల్లి, దెందులూరులో ఒక సీటు తీసుకోవాలని బీజేపీకి ప్రతిపాదనల చేశారు. దీంతో చంద్రబాబు ఈ మూడు నియోజకవర్గాల బీఫామ్‌లను పెండింగ్‌లో పెట్టారు. కానీ టీడీపీ డీల్‌కు బీజేపీ నో చెప్పింది.. మరోవైపు నామినేషన్లకు సమయం తక్కువగా ఉండటంతో అధిష్టానం పెండింగ్ మూడు సీట్లపై క్లారిటీ ఇచ్చేసింది.

అనపర్తీ సీటుపై ఉత్కంఠకు తెర దించుతూ.. నల్లిమిల్లి రామకృష్ణా రెడ్డి బీజేపీలో చేరి అనపర్తి నుంచి బీఫామ్ అందుకున్నారు. దీంతో దెందులూరు, తంబళ్లపల్లిలో టీడీపీ అభ్యర్థులకు లైన్ క్లియర్ అయ్యింది. ఆ రెండు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్నవారికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా చింతమనేని ప్రభాకర్‌కు తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నుంచి ఫోన్ వెళ్లింది. బీఫామ్ తీసుకునేందుకు రావాలని సమాచారం అందించారు. ప్రస్తుతం చంద్రబాబు శ్రీకాకుళంలో ఉండటంతో.. చింతమనేని శ్రీకాకుళం బయలుదేరారు. అయితే, మొన్ననే భారీ ర్యాలీతో దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు చింతమనేని ప్రభాకర్. శ్రీకాకుళంలో ఇవాళ మధ్యాహ్నం టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి బీఫామ్ తీసుకోనున్నారు. మరోవైపు తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డికి కూడా చంద్రబాబు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆయన కూడా శ్రీకాకుళం వెళ్లి బీఫామ్ తీసుకోనున్నారు.

విజయనగరం జిల్లా ఎస్‌.కోట పర్యటనలో ఉన్న చంద్రబాబును పయ్యావుల కేశవ్‌, పరిటాల సునీత కలిశారు. ఇరువురికి బీఫాం పత్రాలను చంద్రబాబు అందజేశారు. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల సంక్షేమం కోసం కష్టపడుతున్నామని.. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా కలిసి పని చేయాని చంద్రబాబు కోరారు. కూటమిని గెలిపించి, మీరంతా మళ్లీ విజయంతో తిరిగి రావాలన్నారు. ఉరవకొండ, రాప్తాడు నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించాలని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు. మొత్తానికి చంద్రబాబు పెండింగ్ బీఫామ్‌లను కూడా అభ్యర్థులకు అందజేస్తున్నారు. గురువారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.. ఈలోపు బీఫామ్‌లు అందజేయాల్సి ఉంటుంది. అందుకే ఇవాళ అన్ని బీఫామ్‌లు క్లియర్ చేస్తున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-24T05:13:54Z dg43tfdfdgfd