చిన్న పరిశ్రమలకు మరిన్ని లోన్లు
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలలో (ఎంఎస్ఎంఈ) ఈక్విటీ పెట్టుబడులను పెంచడానికి కేంద్రం ప్రయత్నాలను ప్రారంభించింది. ముఖ్యంగా వీటికి అసంఘటిత రంగంలో ఫైనాన్సింగ్ అవకాశాలను పెంచడానికి మార్గాలను వెతుకుతోంది. ఢిల్లీలో సోమవారం జరిగిన సమావేశంలో కేంద్ర ఎంఎస్ఎంఈల మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక సేవల విభాగం ఎంఎస్ఎంఈలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశ్రమల సంస్థలు ఈ అంశాలపై చర్చించాయి. రాబోయే కొద్ది రోజుల్లో సిఫార్సులు సూచనలతో ముందుకు రావాలని పరిశ్రమ వాటాదారులను కోరారు.
ఎస్ఆర్ఐ ఫండ్ (సెల్ఫ్ రిలయంట్ ఇండియా) ద్వారా ఎంఎస్ఎంఈల ఈక్విటీ ఫైనాన్సింగ్ను మరింతగా పెంచడం, అసంఘటిత రంగాలలో వ్యాపారాలకు ఫైనాన్సింగ్ను పెంచడంపై సమావేశంలో చర్చించామని అధికారులు చెప్పారు. ఎస్ఆర్ఐ ఫండ్ 2020లో రూ.50 వేల కోట్ల కార్పస్తో ప్రారంభమయింది. అందులో రూ.10,006 కోట్లు కేంద్రం నుంచి, మిగిలినవి ప్రైవేట్ క్యాపిటల్ లేదా వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ నుంచి వస్తాయి. గత మూడేళ్ళలో 425 ఎంఎస్ఎంఈలకు సుమారు రూ.7,593 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఎంఎస్ఎంఈల మంత్రిత్వ శాఖ గత నెలలో ట్వీట్ చేసింది. అదనంగా, 51 డాటర్ ఫండ్స్ను ఎన్ఎస్ఐసీ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కింద ఎంపిక చేశారు.
©️ VIL Media Pvt Ltd. 2024-04-24T01:27:54Z dg43tfdfdgfd