షాద్నగర్లో భారీ అగ్నిప్రమాదం .. మంటల్లో చిక్కుకున్న సిబ్బంది
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నందిగామ మండలంలోని అల్లెన్ ఫార్మసీ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. 300 మంది కార్మికులు పనిచేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో చాలామంది కార్మికులు బయటకు పరుగులు తీశారు. కొంతమంది కార్మికులు లోపలే చిక్కుకున్నారు.
తమను కాపాడాలంటూ లోపలి నుంచి కార్మికులు ఆర్తనాదాలు చేస్తున్నారు. మంటల్లో చిక్కుకున్నవాళ్లను బయటకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. నిచ్చెనల సాయంతో వీలైనంత వేగంగా బాధితులను బయటకు తీసుకువస్తున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు ఫైర్ సిబ్బంది.
సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి. అగ్నిప్రమాదం ఎలా జరిగిందో తెలియాల్సి ఉంది. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తరువాత ఆస్తినష్టం వివరాలు తెలిసే అవకాశముంది.
©️ VIL Media Pvt Ltd. 2024-04-26T13:07:25Z dg43tfdfdgfd