DELHI LIQUOR CASE: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితపై ఈడీ కీలక అభియోగాలు.. బెయిల్ పిటిషన్ రిజర్వ్

Delhi Liquor Case: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు.. ఆమ్ ఆద్మీ పార్టీని, భారత రాష్ట్ర సమితి పార్టీని తీవ్ర చిక్కుల్లో పడేసింది. ఆప్‌లోని కీలక నేతలు జైలుకు వెళ్లగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా తీహార్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కల్వకుంట్ల కవిత పెట్టుకున్న పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. తీర్పును మే 6 వ తేదీకి రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈడీ తరఫున జోయాబ్ హుస్సేన్ వాదనలు వినిపించగా.. కవిత తరపున వాదిస్తున్న లాయర్ నితీష్ రానా.. ఈడీ వాదనలపై శుక్రవారం లిఖితపూర్వకంగా తమ రిజాయిండర్ సమర్పిస్తామని కోర్టుకు తెలిపారు.

ఈ క్రమంలోనే కవిత బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా వాదనలు వినిపించిన ఈడీ.. ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో ఎవరి పాత్ర ఏంటి అనేది వివరించింది. ఈ కేసులో కల్వకుంట్ల కవిత ప్రస్తావనను సైతం కోర్టుకు తెలిపిన ఈడీ.. ఢిల్లీ మద్యం పాలసీ సందర్భంగా లైసెన్స్, మార్జిన్ ఫీజు పెంచడంలో ఎలాంటి లాజికల్ కన్‌క్లూజన్ లేదని స్పష్టం చేసింది. ఢిల్లీ కొత్త మద్యం పాలసీలో మార్జిన్ ఫీజును 5 శాతం నుంచి ఏకంగా 12 శాతానికి పెంచారని తెలిపింది. పెంచిన లాభాన్ని తిరిగి వెనక్కి పొందేలా ఒప్పందం కుదుర్చుకున్నారని వివరించింది.

ఈ వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సౌత్ గ్రూప్‌ల మధ్య విజయ్ నాయర్ మధ్యవర్తిగా వ్యవహరించారని ఈడీ కోర్టుకు చెప్పింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం.. కొత్త మద్యం పాలసీని కొందరికి మేలు చేసేలా తయారు చేశారని అభియోగాలు మోపింది. ఢిల్లీలో అప్పటివరకు అమలు అవుతున్న మద్యం విధానాన్ని పక్కన పెట్టి.. అవినీతి చేసేందుకు కొత్త పాలసీని తీసుకువచ్చారని కోర్టులో ఈడీ వెల్లడించింది. ఇక ఈ ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇండో స్పిరిట్ కంపెనీ చాలా కీలకంగా వ్యవహరించిందని తెలిపింది. లిక్కర్ కేసులో ఉన్న వారికి సుప్రీంకోర్టులో కూడా బెయిల్ లభించలేదని ఈడీ గుర్తు చేసింది.

ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చినట్లు మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్టేట్‌మెంట్‌లో వెల్లడించారని తెలిపింది. కేజ్రీవాల్ సూచన మేరకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. కల్వకుంట్ల కవితను కలిసినట్లు ఈడీ వివరించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో సౌత్ గ్రూప్ భాగస్వామ్యం కోసం ఆప్‌కు రూ.100 కోట్లు ముడుపులు చెల్లించారని.. ఆ రూ.100 కోట్లను మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కల్వకుంట్ల కవిత అడిగారని తెలిపారు. కవిత ఆదేశాల మేరకే రూ.100 కోట్లను సౌత్ గ్రూప్.. ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేసిందని పేర్కొంది.

ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందని.. లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ కోసం కల్వకుంట్ల కవిత తరఫున బుచ్చిబాబు లైజనింగ్ చేశారని ఈడీ తరఫు లాయర్ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు వివరించారు. బుచ్చిబాబు, మాగుంట రాఘవల వాట్సాప్ సందేశాల్లో కీలక సాక్ష్యాలు దొరికాయని ఈడీ తెలిపింది. ఈ సాక్ష్యాలను అప్రూవర్‌గా మారిన మాగుంట రాఘవ ధ్రువీకరించారని చెప్పింది. కోర్టు అనుమతితోనే నిందితులు అప్రూవర్లుగా మారారని.. అయితే వారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు.. ఏ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో డబ్బులు ఇచ్చారు అనేది ఈ కేసులో అనవసరమని ఈడీ వాదించింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-24T14:36:07Z dg43tfdfdgfd