KCR: ఛోటా భాయ్‌కి ఓటేసినా, బడే భాయ్‌కి ఓటేసినా ఒకటే - కేసీఆర్

KCR Comments in Mahabub Nagar: తెలంగాణలో ఈడ చోటే భాయ్ కి ఓటేసినా కేంద్రంలో బడే భాయ్ కి ఓటేసినా ఒకటే అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. బీజేపీ మనకు అక్కరకు రాని చుట్టం అని కొట్టిపారేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర 3 రోజు మహబూబ్ నగర్ కు చేరుకుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేసీఆర్ కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. సాయంత్రం మహబూబ్ నగర్ లో కేసీఆర్ రోడ్డు షో నిర్వహించారు.

పార్లమెంటు ఎన్నికల్లో మూడు పార్టీలు పోటీలో వున్నాయి. వీటిలో ఏ పార్టీ మనకు మేలు చేస్తదో ఆలోచన చేయాలి. బీజేపీ మనకేమన్నా మేలు చేసిందా ఈ పదేండ్ల సంది. మోదీ వంద నినాదాలు చెప్పిండు ఒక్కటన్న నిజమైందా? సబ్ కా వికాస్ అన్నడు కానీ సత్యనాశ్ చేసిండు. అచ్చేదిన్ వచ్చిందా సచ్చేదిన్ వచ్చిందా? నేను గెలిస్తే 15 లక్షలు మీ బ్యాంకుల వస్తాయన్నాడు వచ్చినయా? నరేంద్ర మోదీ విశ్వగురువు ఎట్లాయే?

పాలమూరు ఎత్తి పోతల కోసం వంద ఉత్తరాలు రాసినం జాతీయ హోదా ఇచ్చిండా..? లక్షలాది ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి నింపిండా..? రైతులకు నల్ల చట్టాలు తెచ్చిండు వందలాది రైతుల మరణాలకు కారణమైండు. తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదు. ఈడ చోటే బాయికి ఓటేసినా ఆడ బడే బాయికి ఓటేసినా ఒకటే.. ఏడు మండలాలను ఆంధ్రలో కలిపిన మోదీకి ఎందుకెయాలే ఓటు. బీజేపీ మనకు అక్కరకు రాని చుట్టం. 

ఆంధ్రాకు నీళ్లు మలుపుక పొమ్మని హారతులు పట్టిన డీకే అరుణకు ఓటెందుకెయ్యాలే..? మాకు ఓటేస్తే నిమిషాల మీద ఇదిస్తాం అదిస్తాం అన్నది కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కావస్తోంది. రైతు బందు వచ్చిందా? రుణ మాఫీ అయ్యిందా? పంటలకు బోనస్ వచ్చిందా? స్కూటీ ఇయ్యలేదు గానీ లూటీ అయితే నడుస్తాంది. తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చిండ్రా? ఆసరా పింఛను పెంచిండ్రా. ఫీజు రీఎంబర్స్‌మెంట్ లేదు. ఓవర్సీస్ స్కాలర్ షిప్ బంద్. ప్రతి విషయంలో ప్రతి స్కీమ్ లో మోసం దగా. నాకండ్ల ముందట్నే తెలంగాణను ఆగం చేస్తానంటే కేసీఆర్ యుద్ధం చేస్తాడు తప్ప నిద్రబోడు. బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ దీన్ని గెలిపించాలని ముస్లింలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. 

బీజేపీ గెలిస్తే ఎంతో నష్టం జరుగుతుంది. బీజేపీ కాంగ్రెస్ రొండు ఒకటే. వీళ్లు ఇద్దరు కలిసి భువనగిరిలో బీఆర్ఎస్ ను దెబ్బతీసినాయి. సీఎం స్థాయిలో ఉండి పెగులుపీకుతా ముడ్డి మీది చెడ్డి గుంజుతా జైళ్ల ఎస్తా అంటండు ఇది పద్దతేనా? తెలంగాణ తెచ్చిన నన్ను అట్లా అనుడు మర్యాదేనా? కాంగ్రెస్ పార్టీ వాళ్లు దేవుని మీద ఓట్లు పెట్టి ఓట్లడుగుతాండ్రు. 20 ఎకరాల రైతులు గూడా గోసపడ్డారు. ఐదు ఎకరాలకు మించితే రైతుబంధు ఇయ్యను అంటానవ్ నీ అయ్యా జాగీరా?ఆరో ఎకరం ఏడ బోవాలే..? బీఆర్ఎస్ కు మీరిచ్చే శక్తి మీ శక్తే.. బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డిని గెలిపించండి’’ అని కేసీఆర్ మాట్లాడారు.

2024-04-26T16:45:05Z dg43tfdfdgfd