తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. రెడ్‌, ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ

తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్నాయి. శుక్రవారం ఏకంగా 8 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటడం గమనార్హం. గత పదేళ్లలో ఏప్రిల్‌ నెల చివరి వారంలో ఒకేసారి ఇన్ని కేంద్రాల్లో ఈస్థాయి ఎండలు చూడటం ఇదే తొలిసారి అని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కరీంనగర్‌, పెద్దపల్లి, నల్గొండ, జగిత్యాల, యాదాద్రి, వరంగల్‌, వనపర్తి జిల్లాల్లో ఎండలు 45 డిగ్రీలు దాటటంతో రెడ్‌ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. 25 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ ప్రకటించారు.

రానున్న ఐదురోజుల పాటు పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బయటకు రావద్దని చెప్పింది. వచ్చే ఐదు రోజుల్లో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశాలున్నాయి. మరోవైపు దక్షిణ మధ్యప్రదేశ్‌ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడగా.. ఆదివారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు, తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.

నేడు పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్‌, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-27T03:00:47Z dg43tfdfdgfd