కరువుపై బీఆర్ఎస్ తొండాట..
హైదరాబాద్, వెలుగు : సాగు, తాగునీటి అంశాలపై బీఆర్ఎస్ తీరు ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టుగా తయారైంది. అధికారంలో ఉన్నప్పుడు తప్పులన్నీ చేసేసి కరువు పరిస్థితులకు కారణమైన ఆ పార్టీ.. రివర్స్లో నిందలు మోపుతున్నది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, అన్నారం బ్యారేజీ బుంగలు, కృష్ణా నీళ్లలో వాటా రావాల్సి ఉన్నా పోరాడకుండా కాడి వదిలేయడం, మన నీళ్లను ఏపీ ఎత్తుకపోతుంటే వంతపాడటం, పంట నష్టపోతే రైతులకు రూపాయి పరిహారం ఇవ్వకపోవడం వంటి తప్పులు చేసి.. ఇప్పుడు లొల్లి పెడ్తున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాలకు నీళ్లందిస్తామంటూ కేసీఆర్తో పాటు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన కేటీఆర్, హరీశ్ సహా ఇతర నేతలు చెప్పుకొచ్చారు. ఆ ప్రాజెక్టుతో అసలు 15 లక్షల ఎకరాలకైనా నీళ్లివ్వలేదని తేలిపోయింది. వేలాది టీఎంసీల నీళ్లను వట్టిగా సముద్రం పాల్జేశారు. కోటిఎకరాల మాగాణి అన్న నినాదం ఉత్త మాటలకే పరిమితమైంది. దాదాపు లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు.. ఇప్పుడు పడావు పడే పరిస్థితికి వచ్చింది. ఇందుకు కారణం నాసిరకం పనులేనని నిపుణులు చెప్తున్నారు. కన్నెపల్లి పంపుహౌస్ మునక దగ్గర్నుంచి మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు దాకా కాళేశ్వరం నాణ్యత ఎలాంటిదో తేల్చిచెప్తున్నది.
15 నెలల పాటు ఒక్క టీఎంసీ నీళ్లనూ ఎత్తిపోయలేదు. డ్యామేజీ అయిన మోటార్లను రిపేర్ చేయలేదు. సాగుకు నీళ్లు అందించలేదు. పైగా వరదలు వచ్చి పంపుహౌస్ మునిగిపోతే.. అక్కడి పరిస్థితిని పరిశీలించేందుకు ప్రతిపక్షాల నేతలు వెళ్తే పోలీసులను పెట్టి అడ్డుకున్నది. ప్రపంచంలోనే అతిగొప్ప ప్రాజెక్ట్ కాళేశ్వరం అని చెప్పి బస్సులు పెట్టి టూరిస్టులను తీసుకెళ్లినట్టు తీసుకెళ్లిన అప్పటి బీఆర్ఎస్ సర్కార్.. పంప్హౌస్లు మునిగితే చూడ్డానికి వెళ్లిన ప్రతిపక్షాలను మాత్రం అడ్డుకున్నది. పంపులు మునిగినప్పటి నుంచి ఆ ఏరియాను నిషేధిత ప్రాంతంగా మార్చింది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు జరిగిన డ్యామేజీ కారణంగా వచ్చే వానాకాలంలోనూ నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదు. ఈ నెల 7, 8, 9వ తేదీల్లో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతో పాటు సుందిళ్ల బ్యారేజీనీ ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ పరిశీలించింది. డ్యామేజీకి గల కారణాలపై అధికారుల నుంచి వివరాలను సేకరించింది. కమిటీ నివేదిక రావాల్సి ఉంది. అప్పటి వరకు రిపేర్లు చేసే పరిస్థితి లేదని, మూడు బ్యారేజీల గేట్లనూ వచ్చే ఫ్లడ్ సీజన్ వరకూ తెరిచి ఉంచాల్సిందేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వరదలతో దెబ్బతిన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి, అన్నారం పంప్హౌస్ల పరిస్థితి ఏమిటో కూడా ఇప్పటికీ తెలియదు. వాటి నుంచి నీళ్లను ఎత్తిపోయలేమని రిటైర్డ్ఇంజినీర్లు అంటున్నారు.
కృష్ణా నీళ్ల వాటాలో హక్కుగా రావాల్సిన నీళ్లపైనా గత బీఆర్ఎస్ సర్కార్ పోరాడలేదు. పోతిరెడ్డిపాడుకు బుంగపెట్టి నీళ్లను ఏపీ దోచుకెళ్లిపోతున్నా నోరు మెదపలేదు. శ్రీశైలం బ్యాక్వాటర్లో డెడ్స్టోరేజీ కింది నుంచి కూడా నీళ్లను తోడేసుకునేలా పక్క రాష్ట్రం సంగమేశ్వరం ప్రాజెక్టును కట్టినా చూస్తూ ఊరుకున్నది. పైగా రాయలసీమను రతనాల సీమగా మారుస్తామంటూ ఏపీకి వెళ్లిమరీ నాడు సీఎం హోదాలో కేసీఆర్ చెప్పి వచ్చారు. ఏపీ నీళ్ల దోపిడీకి నాటి బీఆర్ఎస్ సర్కార్ సహకరించింది. పరివాహక ప్రాంతం ఆధారంగా కృష్ణా నీళ్లలో ఫిఫ్టీ ఫిఫ్టీ వాటాను కోరాల్సి ఉన్నా.. 64 (ఏపీ): 36(తెలంగాణ) వాటాకు ఒప్పుకున్నారు. ఆ వాటాకు తగ్గట్టుగా ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 299 టీఎంసీలకే అంగీకరించారు.
దీంతో రాష్ట్ర సాగు నీటి అవసరాలకు భారీగా గండిపడింది. ఉన్న వాటాలోనైనా వాడుకున్నదా అంటే అదీ లేదు. ఏ వాటర్ ఇయర్లోనూ పూర్తిగా వాటా నీళ్లను వాడుకోలేదు. వాటాలో మిగిలిన జలాలను క్యారీ ఓవర్ చేయించుకోలేదు. కనీసం తాగునీటి అవసరాలకూ నీటిని తెచ్చుకోలేని స్థితికి గత బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చింది. తాగునీటి కోసం కేఆర్ఎంబీకి ప్రస్తుత ప్రభుత్వం రిక్వెస్ట్ పెట్టినా.. ఇప్పటికే వాటా వాడేసుకున్నారన్న రిప్లై వచ్చింది. కనీసం క్యారీఓవర్ నీళ్లు 18 టీఎంసీలైనా ఇవ్వాలని కోరినా బోర్డు ఒప్పుకోలేదు. ఇందుకు కారణం గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పిదాలేనని రిటైర్డ్ ఇంజనీర్లు అంటున్నారు.
సంగమేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ పెట్టిన మీటింగులకూ సీఎంగా నాడు కేసీఆర్ హాజరు కాలేదు. ఫలితంగా ఏపీ నీళ్ల దోపిడీకి సహకరించారని రిటైర్డ్ ఇంజినీర్లు అంటున్నారు. కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు ఆమోదం తెలుపుతూ లేఖ రాసింది కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే.
కాంగ్రెస్ వచ్చింది.. కరువు తెచ్చిందంటూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి కరువు ఛాయలు గత బీఆర్ఎస్ హయాంలోనే మొదలయ్యాయి. నిరుడు యావరేజ్ వర్షపాతం నమోదైనప్పటికీ.. అది స్ప్రెడ్ కాలేదు. నాలుగు నెలలు కురవాల్సిన వర్షాలు.. పది రోజుల వ్యవధిలోనే కురిశాయి. పైనుంచి వరదలు కూడా ప్రాజెక్టుల్లోకి రాలేదు. దీంతో కేవలం తాగునీటి అవసరాలకే నీటిని వాడుకోవాలన్న నిబంధనను కేఆర్ఎంబీ పెట్టింది. బీఆర్ఎస్ హయాంలో మొదలైన కరువు ఛాయలు.. ఇప్పటికీ కొనసా గుతున్నాయి. ఎండలు ముదురుతుండటంతో ప్రాజెక్టుల్లో నీళ్లు కరువవుతున్నాయి.
హైదరాబాద్కు తాగునీటి సరఫరాలో కీలకమైన జంటజలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ను గత సర్కార్ పట్టించుకోలేదు. పైగా ఎకో సెన్సిటివ్ జోన్లో ఉన్న ఆ చెరువుల ఏరియాల్లో 111 జీవోను ఎత్తేసింది. ఫలితంగా ఆక్రమణలు పెరిగిపోయి ఆ రెండు చెరువులకు నీళ్లు వచ్చే దారులు మూసుకుపోతున్నాయి. సిటీకి తాగునీటి గండమూ ఏర్పడింది. ఇటు ఎప్పటి నుంచో సిటీకి మంజీరా నీళ్లను సరఫరా చేసేవారు. కానీ, ఆనాటి బీఆర్ఎస్ ప్రభు త్వం మాత్రం దానినీ పట్టించుకోలేదు.
©️ VIL Media Pvt Ltd. 2024-03-29T00:58:21Z dg43tfdfdgfd