బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా తమిళిసై
హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ స్టార్ క్యాంపెయినర్గా మాజీ గవర్నర్ తమిళిసైని బీజేపీ హైకమాండ్ నియమించింది. రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఎన్నికలకు 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల లిస్టును ఖరారు చేసింది. ఈ లిస్టును ఆ పార్టీ నేతలు ఎన్నికల కమిషన్కు అందించారు.
ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, అర్జున్ ముండా, కిషన్ రెడ్డి, ఎల్ మురుగన్ ఉన్నారు. వీరితో పాటు పలు రాష్ట్రాల సీఎంలు యోగి ఆదిత్యనాథ్, ప్రమోద్ సావంత్, భజన్ లాల్ శర్మ, మోహన్ యాదవ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, కర్నాటక మాజీ సీఎం యడ్యూరప్పా, ఆ పార్టీ నేతలు శివప్రకాశ్, సునీల్ బన్సల్, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై తదితరుల పేర్లనూ స్టార్ క్యాంపెయినర్లుగా ఆ పార్టీ ప్రకటించింది.
అలాగే, లిస్టులో రాష్ట్రానికి చెందిన ఎంపీలు కె.లక్ష్మణ్, బండి సంజయ్ కుమార్, పార్టీ జాతీయ నేతలు డీకే అరుణ, పి.మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ఈటల రాజేందర్, బీజేపీ ఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రాజాసింగ్, ఏవీఎన్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, బంగారు శృతి తదితరులు ఉన్నారు. వీరితో పాటు సినీతారలకూ చోటు కల్పించారు.
కుష్బూ సుందర్, రాధిక శరత్ కుమార్, జీవితా రాజశేఖర్ తో పాటు సాయికుమార్ పేర్లను బీజేపీ ప్రకటించింది. తెలంగాణలో నాలుగేండ్ల పాటు గవర్నర్ గా పనిచేసిన తమిళిసై ప్రస్తుతం తమిళనాడులో బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెను తెలంగాణకు స్టార్ క్యాంపెయినర్గా నియమించడం ఆసక్తిగా మారింది.
©️ VIL Media Pvt Ltd. 2024-04-24T02:12:58Z dg43tfdfdgfd