TS INTER RESULTS 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇక్కడ చూసుకోండి

TS Inter Results 2024: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్ష ఫలితాలు నేడు (ఏప్రిల్ 24న) వెలువడ్డాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్, నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఇంటర్ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in తోపాటు https://telugu.abplive.com వెబ్‌సైట్‌లోనూ చూసుకోవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షలకు మొత్తం 9.80 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు.  ఇందులో 4.78 లక్షల మంది ఇంటర్ మొద‌టి సంవత్సరం విద్యార్థులు, 4.43 లక్షల మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. ఇక ఒకేషనల్ కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం 48,277 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 46,542 మంది విద్యార్థులు ఉన్నారు. గతేడాది మే 9న ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేశారు. ఈసారి ఎన్నికల కారణంగా 15 రోజుల ముందుగానే ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటిస్తున్నారు. విద్యార్థులకు సంబంధించిన మార్కుల మెమోలను నాలుగైదు రోజుల్లో అందుబాటులో ఉంచనున్నారు.

విద్యార్థులు ఇంటర్ ఫలితాలు ఇలా చూసుకోవచ్చు..

➥ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- (tsbie.cgg.gov.in)

➥ అక్కడ హోంపేజీలో 'TSBIE 2024 result' లింక్ మీద క్లిక్ చేయాలి.

➥ విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు నమోదుచేయాలి.

➥ కంప్యూటర్ స్క్రీన్ మీద ఫలితాలు కనిపిస్తాయి.

➥ ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. 

ఫలితాల కోసం డైరెక్ట్ లింక్స్: 

Link-1: https://tsbie.cgg.gov.in

Link-2: https://telugu.abplive.com/

పకడ్భందీగా సాగిన మూల్యాంకనం..

ఒకవైపు పరీక్షలు జరుగుతుండగానే మార్చి 10 నుంచి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించిన అధికారులు ఏప్రిల్ 10తో మూల్యాంకనం ముగించారు. గత అనుభవాల దృష్ట్యా.. ఈసారి ఎలాంటి వాటికి అవకాశం ఇవ్వొద్దని ఇంటర్ బోర్డు సూచించింది. దీంతో జవాబు పత్రాల మూల్యాంకనంలో ఎలాంటి తప్పులు దొర్లకుండ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక అధికారులను కూడా నియమించింది. ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తర్వాత ఫలితాలను అప్‌లోడ్ చేశారు. మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జవాబు పత్రాలను మూడేసి సార్లు పరిశీలించడంతో పాటు కోడింగ్, డీకోడింగ్‌ ప్రక్రియ పూర్తిచేశారు. తాజాగా ఫలితాలను విడుదల చేశారు.

ఏప్రిల్ 30న టెన్త్ ఫలితాలు..

ఏపీలో ఇప్పటికే ఇంటర్, టెన్త్ ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16న ఇంటర్ ఫలితాలను, ఏప్రిల్ 21న పదోతరగతి ఫలితాలను అధికారులు వెల్లడించారు. కాగా తెలంగాణలో ఏప్రిల్ 24 ఇంటర్ ఫలితాలను వెల్లడించగా.. ఏప్రిల్ 30న పదోతరగతి ఫలితాలను వెల్లడించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణలో పదోతరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకూ జరగ్గా.. రాష్ట్రవ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 20తో మూల్యాంకనం పూర్తవడంతో.. మరోసారి పరిశీలించి ఫలితాలను అప్‌లోడ్ చేస్తున్నారు. ఏప్రిల్ 30న ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

2024-04-24T05:50:13Z dg43tfdfdgfd