TTD: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మండుటెండల్లో చల్లటి మాట
తిరుమల తిరుపతి దేవస్థానంలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఎండాకాలంలో చల్లటి మాట చెప్పారు దేవస్థానం ఈవో. తాజాగా డయల్ యువర్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పారు. తిరుపతి ఎప్పుడు చూసినా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉంటుంది. ప్రతి రోజు లక్షలాది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం భక్తులు ఇక్కడకు వస్తుంటారు. నిత్యం గోవింద నామ స్మరణంతో తిరుమల కొండలు మారుమోగుతుంటాయి. జనరల్ గా శ్రీవారి దర్శనం అంటే అదో పెద్ద టాస్క్. గంటలు గంటలు క్యూ లైన్లలో నిలబడి వెయిటింగ్ హాల్స్ లో వెయిట్ చేస్తే గానీ చివరకు వెంకటేశుడి దర్శనం లభించదు. సాధారణ ప్రజలకు ఓ లైన్, ప్రత్యేక దర్శనాలకు మరో లైన్.. అదేవిధంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు మరో స్పెషల్ దారి.. ఇలా పలు మార్గాల్లో శ్రీవారి దర్శనాలు కల్పిస్తుంటారు. అయితే ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమలకు సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సామాన్యులకు మేలు కలిగేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఆంక్షలు విధించి చాలా రోజులైంది. అయితే ఇప్పుడు వేసవి రద్దీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నామని, కేవలం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు పరిమితం చేశామని ఆలయ ఈవో అన్నారు. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో తెలిపారు. క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు ఆలయ మాడ వీధుల్లో చలువ పందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం మరిన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు.
2024-05-04T01:54:30Z