15 ఏళ్ల పాలకులు.. పలుగు పార పట్టి పనులకు వెళుతున్నారు !
ప్రస్తుత సమాజంలో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఏ చిన్న నాయకుడైనా చేసే పెద్దరికం హంగామా మామూలుగా ఉండదు.. కానీ ఈ గ్రామానికి చెందిన దంపతులిద్దరూ 3 పర్యాయాలు (15 సంవత్సరాల పాటు) సర్పంచ్ లు గా సేవలందించి నేడు ఉపాధి కూలీలుగా మారి జీవనం సాగిస్తున్నారు. ఈ సర్పంచ్ దంపతులు ఎవరు..!? అసలు వారు ఉపాధి హామీ కూలీలుగా మారడానికి గల కారణాలేంటనే అంశాలపై లోకల్18 ప్రత్యేక కథనం. దంపతులిద్దరూ పలుమార్లు గ్రామానికి సర్పంచ్ గా సేవలందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన దొంగరి భూమయ్య, గంగవ్వ దంపతులు గతంలో పలు పర్యాయాలు సర్పంచ్ లుగా ఎన్నికై పంచాయతీకి సేవలు అందించారు. భూమయ్య పదేళ్ళు, గంగవ్వ ఐదేళ్లు సర్పంచ్ లుగా కొనసాగారు. వీరి కాలంలో గ్రామం అభివృద్ధి వైపు ఆడుగులు వేసిందని, గ్రామంలో సిసి రోడ్లు కూడా నిర్మాణం చేపట్టారని గ్రామ ప్రజలకు చెబుతున్నారు. మొదటి నుంచి వారిది వ్యవసాయ కుటుంబమేనని, సర్పంచ్ కాక ముందు భూమయ్యకు రెండు ఎకరాల భూమి ఉండేదని, సర్పంచ్ గా మూడు పర్యాయాలైన వీరు కారణాలు ఏంటో తెలియదు కానీ, ఉన్న రెండు ఎకరాల భూమి కూడా అమ్ముకున్నట్లు తెలుస్తోంది.అనునిత్యం ప్రజాసేవలోనే నిమగ్నమైన మాజీ సర్పంచ్ దంపతులు.. నిస్వార్ధంగా ప్రజాసేవ చేశారని, వీరి జీవితం ఎందరికో స్ఫూర్తి అంటారు వీరి గ్రామస్తులు. ఈ దంపతుల హయాంలోనే గ్రామ అభివృద్ధి సాగిందని ప్రజలు చెబుతున్నారు. మాజీ సర్పంచ్ భూమయ్య ఏడవ తరగతి వరకు చదివారని, ప్రస్తుతం అనునిత్యం ఉపాధి హామీ కూలీ పనులకు మాజీ సర్పంచ్ దంపతులు వెళ్తున్న దృశ్యాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.ప్రస్తుత సమాజంలో ఏదైనా పార్టీలో ఉన్న కొందరు కార్యకర్త నుంచి వార్డ్ మెంబర్ దాకా.. ఏదో అక్రమాలకు పాల్పడుతూ కోట్లకు పడగలెత్తుతున్న ఈ రోజుల్లో, పలు దఫాలుగా దంపతులిద్దరూ గ్రామానికి నిస్వార్ధంగా సేవ చేసి ఉన్న కాస్త భూమిని కూడా అమ్ముకున్నారని గ్రామ ప్రజలు తెలిపారు. 10 సంవత్సరాల క్రితం మూడు పర్యాయాలు వారే గ్రామానికి సర్పంచులుగా దంపతులు ఇద్దరూ సేవలందించారు. భూమయ్య పది సంవత్సరాలు అతని భార్య ఐదు సంవత్సరాలుగా సర్పంచ్ లుగా కొనసాగారు. ఉపాధి హామీ పథకం కూలిగా పనులకు వెళ్తున్న ఈ దంపతులు..మేము సామాన్యులం, పొట్ట కూటి కోసం కష్టపడి జీవించడంలో తప్పులేదని అంటూ తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు సరైన సౌకర్యాలు పనిచేసే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని మాజీ సర్పంచ్ భూమయ్య కోరుతున్నారు. ఏమైనప్పటికీ ఇలాంటి నిస్వార్ధ ప్రజా సేవకుల సేవలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రజలు చర్చించుకుంటున్నారు. నిజాయితీగా గ్రామానికి సేవ చేసిన వారు కాబట్టే నేడు, ఉపాధి కూలిగా మారారని ఈ దృశ్యాలు చెప్పకనే చెబుతున్నాయి.
2024-05-03T03:51:22Z