15 ఏళ్ల పాలకులు.. పలుగు పార పట్టి పనులకు వెళుతున్నారు !
ప్రస్తుత సమాజంలో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఏ చిన్న నాయకుడైనా చేసే పెద్దరికం హంగామా మామూలుగా ఉండదు.. కానీ ఈ గ్రామానికి చెందిన దంపతులిద్దరూ 3 పర్యాయాలు (15 సంవత్సరాల పాటు) సర్పంచ్ లు గా సేవలందించి నేడు ఉపాధి కూలీలుగా మారి జీవనం సాగిస్తున్నారు. ఈ సర్పంచ్ దంపతులు ఎవరు..!? అసలు వారు ఉపాధి హామీ కూలీలుగా మారడానికి గల కారణాలేంటనే అంశాలపై లోకల్18 ప్రత్యేక కథనం. దంపతులిద్దరూ పలుమార్లు గ్రామానికి సర్పంచ్ గా సేవలందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన దొంగరి భూమయ్య, గంగవ్వ దంపతులు గతంలో పలు పర్యాయాలు సర్పంచ్ లుగా ఎన్నికై పంచాయతీకి సేవలు అందించారు. భూమయ్య పదేళ్ళు, గంగవ్వ ఐదేళ్లు సర్పంచ్ లుగా కొనసాగారు. వీరి కాలంలో గ్రామం అభివృద్ధి వైపు ఆడుగులు వేసిందని, గ్రామంలో సిసి రోడ్లు కూడా నిర్మాణం చేపట్టారని గ్రామ ప్రజలకు చెబుతున్నారు. మొదటి నుంచి వారిది వ్యవసాయ కుటుంబమేనని, సర్పంచ్ కాక ముందు భూమయ్యకు రెండు ఎకరాల భూమి ఉండేదని, సర్పంచ్ గా మూడు పర్యాయాలైన వీరు కారణాలు ఏంటో తెలియదు కానీ, ఉన్న రెండు ఎకరాల భూమి కూడా అమ్ముకున్నట్లు తెలుస్తోంది.అనునిత్యం ప్రజాసేవలోనే నిమగ్నమైన మాజీ సర్పంచ్ దంపతులు.. నిస్వార్ధంగా ప్రజాసేవ చేశారని, వీరి జీవితం ఎందరికో స్ఫూర్తి అంటారు వీరి గ్రామస్తులు. ఈ దంపతుల హయాంలోనే గ్రామ అభివృద్ధి సాగిందని ప్రజలు చెబుతున్నారు. మాజీ సర్పంచ్ భూమయ్య ఏడవ తరగతి వరకు చదివారని, ప్రస్తుతం అనునిత్యం ఉపాధి హామీ కూలీ పనులకు మాజీ సర్పంచ్ దంపతులు వెళ్తున్న దృశ్యాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.ప్రస్తుత సమాజంలో ఏదైనా పార్టీలో ఉన్న కొందరు కార్యకర్త నుంచి వార్డ్ మెంబర్ దాకా.. ఏదో అక్రమాలకు పాల్పడుతూ కోట్లకు పడగలెత్తుతున్న ఈ రోజుల్లో, పలు దఫాలుగా దంపతులిద్దరూ గ్రామానికి నిస్వార్ధంగా సేవ చేసి ఉన్న కాస్త భూమిని కూడా అమ్ముకున్నారని గ్రామ ప్రజలు తెలిపారు. 10 సంవత్సరాల క్రితం మూడు పర్యాయాలు వారే గ్రామానికి సర్పంచులుగా దంపతులు ఇద్దరూ సేవలందించారు. భూమయ్య పది సంవత్సరాలు అతని భార్య ఐదు సంవత్సరాలుగా సర్పంచ్ లుగా కొనసాగారు. ఉపాధి హామీ పథకం కూలిగా పనులకు వెళ్తున్న ఈ దంపతులు..మేము సామాన్యులం, పొట్ట కూటి కోసం కష్టపడి జీవించడంలో తప్పులేదని అంటూ తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు సరైన సౌకర్యాలు పనిచేసే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని మాజీ సర్పంచ్ భూమయ్య కోరుతున్నారు. ఏమైనప్పటికీ ఇలాంటి నిస్వార్ధ ప్రజా సేవకుల సేవలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రజలు చర్చించుకుంటున్నారు. నిజాయితీగా గ్రామానికి సేవ చేసిన వారు కాబట్టే నేడు, ఉపాధి కూలిగా మారారని ఈ దృశ్యాలు చెప్పకనే చెబుతున్నాయి.
2024-05-03T03:51:22Z
TTD: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మండుటెండల్లో చల్లటి మాట
తిరుమల తిరుపతి దేవస్థానంలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఎండాకాలంలో చల్లటి మాట చెప్పారు దేవస్థానం ఈవో. తాజాగా డయల్ యువర్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పారు. తిరుపతి ఎప్పుడు చూసినా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉంటుంది. ప్రతి రోజు లక్షలాది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం భక్తులు ఇక్కడకు వస్తుంటారు. నిత్యం గోవింద నామ స్మరణంతో తిరుమల కొండలు మారుమోగుతుంటాయి. జనరల్ గా శ్రీవారి దర్శనం అంటే అదో పెద్ద టాస్క్. గంటలు గంటలు క్యూ లైన్లలో నిలబడి వెయిటింగ్ హాల్స్ లో వెయిట్ చేస్తే గానీ చివరకు వెంకటేశుడి దర్శనం లభించదు. సాధారణ ప్రజలకు ఓ లైన్, ప్రత్యేక దర్శనాలకు మరో లైన్.. అదేవిధంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు మరో స్పెషల్ దారి.. ఇలా పలు మార్గాల్లో శ్రీవారి దర్శనాలు కల్పిస్తుంటారు. అయితే ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమలకు సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సామాన్యులకు మేలు కలిగేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఆంక్షలు విధించి చాలా రోజులైంది. అయితే ఇప్పుడు వేసవి రద్దీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నామని, కేవలం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు పరిమితం చేశామని ఆలయ ఈవో అన్నారు. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో తెలిపారు. క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు ఆలయ మాడ వీధుల్లో చలువ పందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం మరిన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు.
2024-05-04T01:54:30Z