Weather Report: ఏపీ, తెలంగాణకు పిడుగులతో వర్ష సూచన.. 5 రోజులు ఇంతే!
ఈ సంవత్సరం ఎల్నినో వల్ల ఎండలు దంచేశాయి. ఐతే.. మే నెల మొదలవ్వగానే.. ఎండల వల్ల నీటి ఆవిరి బాగా పెరిగి.. ఆకాశంలో మేఘాలు ఎక్కువయ్యాయి. దాంతో.. వాతావరణం ఒక్కసారిగా మారింది. తమిళనాడులో ద్రోణి ఏర్పడి.. అది తెలుగు రాష్ట్రాలపై చాలా బలంగా విస్తరించింది. ప్రస్తుతం రాయలసీమ అంతటా ద్రోణి బలంగా ఉంది. కాబట్టి.. ఇవాళ కూడా తెలుగు రాష్ట్రాలకు వర్షం తప్పదు. భారత వాతావరణ విభాగం (IMD) లేటెస్ట్ బులిటెన్ ప్రకారం.. ద్రోణి కొనసాగుతోంది. దాని వల్ల తెలంగాణ, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటూ.. అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఐతే.. వానతోపాటూ.. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇవాళ ముఖ్యంగా కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అని IMD విడిగా ప్రత్యేకంగా చెప్పింది. అంటే.. ఆ ప్రాంతాల్లో వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. అసలే ఈ వానలు మామూలుగా లేవు. దంచేస్తున్నాయి. నిన్న వానల వల్ల ఏడుగురు చనిపోయారంటేనే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. శాటిలైట్ అంచనాలను చూద్దాం. వాటి ప్రకారం ఇవాళ ఉదయం వేళ తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల మేఘాలు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల, గుంటూరు, నంద్యాల, అనంతపురం వంటి చోట్ల వాన పడుతుంది. ఉదయం 10 తర్వాత రాయలసీమలో మేఘాలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం 2 తర్వాత విశాఖలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. సాయంత్రం 4 తర్వాత మళ్లీ హైదరాబాద్లో భారీ వర్షం పడేలా కనిపిస్తోంది. అలాగే.. విశాఖ, ఉత్తరాంధ్ర నుంచి కాకినాడ వరకూ మోస్తరు వర్షం పడేలా ఉంది. హైదరాబాద్లో వాన రాత్రి 8 గంటల వరకూ పడే అవకాశం కనిపిస్తోంది. అర్థరాత్రి వరకూ హైదరాబాద్పై మేఘాలు ఉంటాయి. రాయలసీమలో రాత్రి 8 తర్వాత మేఘాలు ఉండకపోవచ్చు. గాలి వేగం.. ఉదయం, సాయంత్రం తర్వాత విపరీతంగా పెరుగుతోంది. బంగాళాఖాతంలో ఇవాళ గాలి వేగం గంటకు 17 నుంచి 21 కిలోమీటర్లుగా ఉంటుంది. ఏపీలో గాలి వేగం గంటకు 9 నుంచి 14 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 9 నుంచి 14 కిలోమీటర్లుగా ఉంటుంది. ఐతే.. వాన పడే సమయంలో గాలి వేగం బాగా పెరుగుతుంది. ఈదురు గాలులు వస్తాయి. ఉష్ణోగ్రత ఇవాళ మరింత తగ్గనుంది. ఏపీలో పగటివేళ 34 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తెలంగాణలో 35 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఇవాళ తూర్పు రాయలసీమలో కొంత వేడి ఉండేలా కనిపిస్తోంది. మే నెలలో తొలిసారి తెలుగు రాష్ట్రాల్లో కొంత తేమ కనిపిస్తోంది. ఈ తేమ 40 నుంచి 80 శాతం దాకా ఉంటోంది. అంటే.. ఇవాళ చాలా ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, శ్రీశైలం, దేవరకొండలో కొంత ఎక్కువ వాన పడే ఛాన్స్ ఉంది. (All Images credit - IMD)
2024-05-08T00:34:37Z